Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

దిశ@4: మీడియా ప్రజాస్వామీకరణ

Posted on March 7, 2024

దిశ లాంటి పేపర్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుంది?.. తెలంగాణ మీడియా సర్కిళ్లలో ఈ మాట కొంతకాలంగా తరచూ వినిపిస్తున్నది. సాధారణ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో వచ్చిన దిశ నాలుగేళ్లలోనే సూపర్ సక్సెస్ కావడం వాళ్లనలా మాట్లాడిస్తున్నది. అప్పటిదాకా ఒక ప్రధాన స్రవంతి దినపత్రిక పెట్టాలంటే పదుల, వందల కోట్లలో పెట్టుబడి అవసరం అయ్యేది.

నెలవారీ ఖర్చుల కోసం ప్రభుత్వ ప్రకటనల పైనా, పార్టీల ప్యాకేజీల పైనా ఆధారపడాల్సివచ్చేది. వార్తలపై అనివార్యంగా గుత్తాధిపత్యం కొనసాగేది. ఏ వార్త రావాలి.. ఏ వార్త రాకూడదో కొన్ని వర్గాలు నిర్దేశించేవి.

తెలుగునాట టాప్ మీడియా సంస్థలన్నింటి వెనకాలా ఏదో ఒక పార్టీయో, పార్టీల వెన్నుదన్ను కలిగిన పెట్టుబడిదారుడో ఉన్న పరిస్థితుల మధ్య 2020 మార్చ్ 7న వచ్చిన దిశ తన కర్తవ్యాన్ని నిష్ఠతో నెరవేర్చింది. పెట్టుబడి చేతిలో బందీ అయిన అక్షరాన్ని ప్రజాస్వామీకరించింది. విశ్వసనీయత లేని సోషల్ మీడియా వేగాన్ని, నింపాదిగా నడిచే ప్రింట్ మీడియా ప్రామాణికతను సమర్థవంతంగా జోడించి సరికొత్త వేదికను ఆవిష్కరించింది.

‘‘మాకు లేదు ఏ పక్షం.. మేమెప్పుడూ ప్రజల పక్షం’’ నినాదంతో పనిచేస్తున్నది. ఖర్చులకు, వార్తలకు లింకు పెట్టకుండా, ఎడిటోరియల్ పాలసీపై రాజీ పడకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ సత్యమే గమ్యం.. గమనంగా దూసుకుపోతున్నది.

ఎన్నో అడ్డంకులు.. కేసులు.

నాలుగేళ్ల మా గమనంలో ఎన్నో అడ్డంకులు, మరెన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రజల సమస్యలను ఫోకస్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తున్నామని అప్పటి అధికారపక్షం మాపై ఆగ్రహించింది. కేసులు, లీగల్ నోటీసులు అటుంచితే, ఏ రకమైన యాడ్స్ రాకుండా నిలిపేసింది. చివరకు, జర్నలిస్టుల హక్కుగా భావించే అక్రెడిటేషన్ సౌకర్యాన్ని తిరస్కరించింది. స్వతంత్ర జర్నలిస్టులుగా ఇష్యూ అయిన ఎడిటర్, మరికొందరి కార్డులను అందకుండా ఆపేసింది.

మరోవైపు, ప్రజల పక్షాన ఉండాల్సిన చోట తప్పటడుగులు వేసినప్పుడు నిర్మొహమాటంగా కథనాలు రాసిన ఫలితంగా ప్రతిపక్షాలు కూడా మమ్మల్ని సొంతం చేసుకోలేకపోయాయి. దిశ కథనాలపై సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో టాక్ నడిచింది. కొంతకాలం ఒక ప్రతిపక్ష నేత పేపర్ అని, మరికొంత కాలం ఇంకో ప్రతిపక్ష నేత పేపర్ అని మమ్మల్ని బ్రాండింగ్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.

ఫేక్ క్లిప్స్ తో దుష్ప్నచారం..

నిజం ఏమిటంటే దిశ ఏ పక్షం, ఏ వర్గం కోసం పనిచేసే పత్రిక కాదు. వాస్తవం ఎటువైపు ఉందో, ప్రజలు ఎటువైపు ఉన్నారో దిశ అటువైపు ఉంటుంది. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ విధానాలకు అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేక వైఖరిని తీసుకుంటుంది. నాలుగేళ్ల మా ప్రయాణాన్ని, ప్రజల్లో మాకున్న విశ్వసనీయతను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. దిశ పేరుతో ఫేక్ క్లిప్స్ పెట్టి ప్రజలను నమ్మించడానికి ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న ప్రయత్నాలు మా క్రెడిబిలిటీకి ప్రత్యక్ష ఉదహరణలు.

తెలుగునాట దిశ ట్రెండ్ సెట్టర్..

తెలుగునాట దిశ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకంలో 12.4 కోట్ల మంది యూనిక్ యూజర్ బేస్‌ను కలిగియుండి, రోజువారీగా 30 లక్షల పైన పాఠకులను, 50 లక్షల పైన వీక్షణలను దిశ పొందుతోంది. వెబ్‌సైట్ల ఆదరణను కొలిచే ‘సిమిలర్ వెబ్’ నెలవారీ ర్యాంకుల్లో దిశ ఎప్పుడూ టాప్ ఫోర్ ప్రధాన స్రవంతి పత్రికల సరసన నిలుస్తున్నది.

ఎడిషన్ వెలువడిన తక్షణం దిశ వార్తల క్లిప్పులు, లింకులు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 2021 మార్చ్‌ లో డైనమిక్ ఎడిషన్లను దిశ ప్రారంభించింది. ఈ రోజు వార్తలను రేప్పొద్దున ఇచ్చే సంప్రదాయాన్ని బద్దలు కొట్టి ఎప్పటి వార్తలను అప్పుడే అందిస్తున్నది.

ప్రజల మద్దతు కావాలి..

రాజీ లేకుండా ఇలాగే కొనసాగడానికి దిశకు ప్రజల, పాఠకుల మద్దతు కావాలి. ప్రజాస్వామ్యం, స్వతంత్ర మీడియా వర్ధిల్లాలని కొరుకునే అన్ని వర్గాల మేధావులు, పార్టీలు, ప్రజాసంఘాలు, అధికారయంత్రాంగం, వ్యాపారవర్గం మమ్మల్ని ఆదరించాలి. అవినీతి, అక్రమాల, అవకతవకల సమాచారాన్ని అందించడంతో పాటు ప్రకటనల రూపంలో, చందాల రూపంలో సపోర్ట్ చేయాలి.

ప్రజాపాలన చేస్తున్నామని చెబుతున్న ప్రస్తుత ప్రభుత్వం ప్రధాన స్రవంతి మీడియా సరసన ఉన్న దిశను గుర్తించి సహకరించాలి. కాలం చెల్లిన, పలుకుబడి ప్రాతిపదికన నడుస్తున్న ఐ అండ్ పీఆర్ అడ్వర్టయిజ్మెంట్ పాలసీని ఆధునీకరించాలి. ప్రజాదరణే కొలమానంగా ప్రకటనలు విడుదల చేయాలి.

టి మోహన్‌రావు, మేనేజింగ్ డైరెక్టర్                                  డి మార్కండేయ, ఎడిటర్

 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme